Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 15

Deva's prayers to MahaVishnu

With Sanskrit text in Devanagari , Telugu and Kannada

మేధావీతు తతో ధ్యాత్వా స కించిదిదముత్తరమ్ |
లబ్ధ సంజ్ఞః తతస్తం తు వేదజ్ఞో నృపమబ్రవీత్ ||

తా|| ఆ మేధావి అయిన ఋష్యశృంగుడు తను ఇచ్చిన మాట పిమ్మట క్షణమాలోచించి పిమ్మట కర్తవ్యము స్ఫురింపగా ఆ వేదజ్ఞుడు మహారాజునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను.

బాలకాండ
పదునైదవ సర్గము
( రావణ సంహారమునకు విష్ణువును దేవతలు ప్రార్థించుట )

ఆ మేధావి అయిన ఋష్యశృంగుడు తను ఇచ్చిన మాట పిమ్మట క్షణమాలోచించి పిమ్మట కర్తవ్యము స్ఫురింపగా ఆ వేదజ్ఞుడు మహారాజునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను.

"ఓ రాజా! నీకు పుత్త్రులు కలుగుటకు అధర్వ సిరస్సు వేదభాగమందు పేర్కొనబడిన మంత్రములతో విధియుక్తముగా 'పుత్త్రకామేష్టి' అను క్రతువును నిర్వహించెదను". అనంతరము ఆ ఋషి "పుత్త్రకామేష్టి" యాగమును ప్రాంభించెను. ఆ తేజోమయుడు వేదమంత్రములు పఠించుచూ అగ్నికి ఆహుతులు సమర్పించెను. ఆప్పుడు బ్రహ్మాది దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు తమతమ హవిర్భాగములు గ్రహించుటకై యథాక్రమముగా యజ్ఞశాలయందు ప్రత్యక్షమైరి.

దేవతలందరూ క్రమముగా సదస్సునకు చేరి సృష్టికర్త అయిన బ్రహ్మతో ఇట్లు విన్నవించుకొనిరి.

'ఓ దేవా ! నీ అనుగ్రహము చేత రావణుడు అను రాక్షసుడు తన పరాక్రమముచే అందరినీ చిత్రహింసలు చేయుచున్నాడు. వానిని శాసించుటకు మేము అశక్తులము. భగవన్ ! పూర్వము అతని తపస్సునకు మెచ్చి నీవు ఆయనకు వరమొసగితివి. దానిని గౌరవించుచూ మేము నిత్యమూ అతని సర్వకార్యములను సహించుచున్నాము. ఆ దుర్మతి గర్వముతో ముల్లోకములను బాధించుచున్నాడు. ఉన్నతులను ద్వేషించుచున్నాడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుని రాజ్యభ్రష్ఠుని గావింపచూచుచున్నాడు. ఋషులు యక్షులు గంధర్వులు అసురులు , బ్రాహ్మణులను వరదానము వలన గర్వముతో హింసించుచున్నాడు'.

'(అతనికి భయపడి) సూర్యుడు తన కిరణములవేడి తగ్గించుచున్నాడు. వాయువు వీచుటలేదు. ఉవ్వెత్తు తరంగములతో నుండు సాగరము కంపించుటలేదు. మహాత్మా ! అందువలన భయంకరాకారుడైన ఆ రాక్షసుని భయపడుచున్నాము. కావున వానిని వధింపు ఉపాయము మీరే ఆలోచించుడు'.

దేవతలందరూ ఇట్లు చెప్పగా బ్రహ్మదేవుడు క్షణమాలోచించి ,' ఆ దురాత్ముని వధించుటకు ఉపాయము స్ఫురించినది. "గంధర్వులచే గాని యక్షులచేగాని దేవతలచేగాని దానవులచే గాని రాక్షసులచే గాని నాకు మరణము లేకుండునట్లు వరమిమ్ము" అని రావణుడు కోరెను. నేను "అట్లే" అని అంటిని. అజ్ఞానమువలన మానుషులనుంచి రక్షణ కోరలేదు. కావున మానవుని చేతిలో అతని మరణము సంభవము . ఇతరుల వలన కాదు.'

బ్రహ్మదేవుడు పలికిన ప్రీతికరమైన మాటలను విని దేవతులు మహర్షులు అందరునూ ఆనందముతో ఉప్పొంగిపోయిరి. అంతట జగత్పతి అయిన మహావిష్ణువు శంఖ చక్ర గదాపాణి అయి పీతాంబరధారి అయి దివ్య తేజస్సుతో విరాజిల్లుచూ యజ్ఞశాలకు అరుదెంచెను. అంతట ఆ మహావిష్ణువు బ్రహ్మతో గూడి అచట ఉపస్థితుడాయెను. అప్పుడు దేవతలందరూ ఆ దేవదేవుని సంస్తుతించి సాగిలబడి ఇట్లు ప్రార్థించిరి.

"ఓ మహావిష్ణూ ! లోకహితము కోరి మేము నిన్నువేడుకొనుచున్నాము. అయోధ్యాధిపతి అయిన దశరథమహారాజు సర్వ సమర్థుడు ధర్మజ్ఞుడు, ఉదారస్వభావుడు , మహర్షులతో సమానమైన తేజస్సు గలవాడు. అతని ముగ్గురు భార్యలు హ్రీ శ్రీ కీర్తి అను వారితో సమానులు. వారికి నాలుగురూపములలో పుత్త్రుడవు కమ్ము. అచట నీవు మానుషరూపము ధరించి , దేవతలకు వధింపసాధ్యము కాని ఆ రావణుని సమరములో హతమొనర్చుము."

"మూర్ఖుడైన ఆ రాక్షస రావణుడు పరాక్రమగర్వముతో దేవతలను , గంధర్వులను, సిద్ధులను , మునిసత్తములను బాధించుచున్నాడు.ఆ క్రూరుడు ఋషులను అట్లే నందనవనమున విహరించు గంధర్వులను అప్సరలను హింసించుచున్నాడు".

"సిద్ధ గంధర్వ యక్షులతో మునులతో గూడి మేము రావణ వధ కొఱకు ఇచటికి వచ్చి మిమ్ము శరణు కోరుచున్నాము. ఓ మహావిష్ణూ మా అందరికీ నీవే గతి. దేవతలకు శత్రువైన రాక్షసులను వధించుటకు మానవుడై అవతరించుటకు సంకల్పింపుము".

బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్థింపగా సకలలోకా ఆరాధ్యుడు దేవ దేవుడు అయిన శ్రీ మహావిష్ణువు తనను శరణుజొచ్చిన బ్రహ్మాది దేవతలతో ఇట్లు చెప్పెను.

" భయమును వీడుడు. మీకు భద్రత చేకూరును. క్రూరుడు దురాత్ముడు దేవర్షులను భాధించుచున్న వాడు అగు రావణుని అతని పుత్త్రులను, పౌత్రులను , అమాత్యులను , బంధువులను, మిత్రులను జ్ఞాతులను లోకహితార్థమై హతమార్చెదను. పిమ్మట పదివేలసంవత్సరములు, ఆ తరువాత పది వందలసంవత్సరములు ఆ మానవలోకమున నివశించి ఆ భూమండలము పాలించెదను"'

ఆవిధముగా వరమునిచ్చి , సకల ప్రాణులకు ఆధారమైన దేవ దేవుడైన శ్రీమహావిష్ణువు మానవలోకమున తాను అవతరింపదగిన స్థానమును గురించి ఆలోచించెను. పిమ్మట ఆ రాజీవలోచనుడు తాను దశరథమహారాజునకు నాలుగు రూపములలో పుత్త్రులుగా జన్మించుటకు సంకల్పించెను.

అప్పుడు బ్రహ్మారుద్రాది దేవతలు , ఋషులు , గంధర్వులు, అప్సరసలు, దివ్యస్తుతులతో మధుసూదనుడు అగు శ్రీమహావిష్ణువును స్తుతించిరి.
'రావణుడు ఉగ్రమైన తేజస్సు కలవాడు , అతిగర్వముకలవాడు,ఇంద్రుని ద్వేషించువాడు, సాధువులను తపస్విలను హింసించువాడు,భయము కలగించువాడు, అట్టి దుష్టుని సంహరింపుము. అట్టి క్రూరుని, వాని బలములతో బాంధవులతో సంహరించి ఆర్తుల కష్తములను తొలగించి పిమ్మట ఓ దేవా ! రాగ ద్వేషములకు తావులేనిది అయిన స్వలోకమునకు తిరిగిరమ్ము' అని.


ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే పంచదశస్సర్గః ||
సమాప్తం ||

త మేవ హత్వా సబలం స బాంధవం
విరావణం రావణ ముగ్ర పౌరుషమ్ |
స్వర్లోకమాగచ్ఛ గచ్ఛ గతజ్వరశ్చిరం
సురేంద్రగుప్తం గతదోషకల్మషమ్ ||

తా|| 'అట్టి క్రూరుని , వాని బలములతో బాంధవులతో సంహరించి ఆర్తుల కష్తములను తొలగించి పిమ్మట ఓ దేవా ! రాగ ద్వేషములకు తావులేనిది అయిన స్వ లోకమునకు తిరిగిరమ్ము' అని.

|| om tat sat ||